జగనన్న వదిలిన బాణం ఎదురు తిరుగుతోందా? రేపు షర్మిల ఆత్మీయ సమ్మేళనం

 



రేపు వైఎస్ విజయమ్మ రాజశేఖర్ రెడ్డిల పెళ్లి రోజు.. అదే రోజు ఆమె వారసురాలు షర్మిల ఆత్మీయ సమ్మేళనానికి పిలుపు ఇవ్వడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.. ఆమె కొత్త పార్టీ పెడతారంటూ ఊహాగానాలు ఇంకాస్త పెరిగాయి.. మరి రేపు షర్మిల ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.


జగన్ అన్న వదిలన బాణం ఎదురు తిరుగుతోందా..? కొత్త పార్టీ పెట్టబోతోన్నారా..?  అన్నపైనా విమర్శల బాణం ఎక్కుపెట్టబోతున్నారా..? రేపు లోటస్ పాండ్ లో ఆత్మీయ సమ్మేళనం  వెనుక వ్యూహం ఏంటి..? గత కొంతకాలంగా ఆమె కొత్త పార్టీ పెడుతున్నారంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆమె పిలుపు ఇచ్చిన ఆత్మీయ సమ్మేళనానికి  ప్రాధాన్యం ఏర్పడింది..

తెలుగు రాష్టాల్లో పరిచయం అవసరం లేని పేరు షర్మిల.. ఆమె అనూహ్యంగా రేపు సమావేశానికి పిలుపు ఇచ్చారు. వైఎస్ఆర్ అభిమానులు, అనుచరులతో  ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అయితే ఈ భేటీ అజెండా ఏంటి అన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇంత సడెన్ గా సమావేశానికి ఎందుకు పిలుపు ఇచ్చారు.  ఈ ఆత్మీయ సమ్మేళనం వెనుక కారణం ఏంటనే చర్చ జరుగుతోంది. రాజన్న కూతురుగా  ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి జగన్ అభిమానులూ వస్తారా.. లేక జగన్ తీరుపై  గుర్రుగా ఉన్నవారు మాత్రమే హాజరవుతారా అన్నది చూడాలి..

వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నారంటూ గత మూడు, నాలుగు నెలలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అందుకే ఇప్పుడు ఆమె ఆత్మీయ సమ్మేళనం పేరుతో మీటింగ్ కు పిలుపు ఇవ్వడంపై ఊహాగానాలు నెలకొన్నాయి.

వైఎస్ఆర్ అభిమానులారా లోటస్ పాండ్ కు తరలిరండి.. మన అడుగు రేపటి తెలంగాణ భవితకు పునాది అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ముమ్మర ప్రచారం జరుగుతోంది. అయితే మరో ప్రచారం కూడా తెలంగాణలో ఉంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ బలపడుతోంది. అందుకే బీజేపీని ఢీ కొట్టాలి అంటే రెడ్డి సామాజిక వర్గం నేతలు ఏకం కావాల్సి ఉంది. లేదంటే చాలామంది బీజేవైపు అడుగులు వేసే అవకాశం ఉంది.  అందుకే టీఆర్ఎస్ పెద్దల ప్రమేయంతోనే షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

షర్మిల పార్టీ పెడుతున్నారన్న వార్తలపై సీఎం కేసీఆర్ కూడా స్పందించారు. నేరుగా ఆమె పేరు ప్రస్తావించకపోయినా పార్టీ ఏర్పాటు అన్నది అంత ఈజీ కాదు అంటూ కొట్టిపారేశారు. కేసీఆర్ కామెంట్ చేసిన కొన్నిగంటల్లోనే ఆమె ఆత్మీయ సమ్మేళనానికి పిలుపు ఇవ్వడం తీవ్ర ఆసక్తి రేపుతోంది.. నిజంగానే ప్రచారం జరుగుతున్నట్టు  వైఎస్ కుటుంబంలో అసమ్మతి సెగలు ఉన్నాయా..? అభిమానులకు పిలుపు ఇచ్చింది అందుకేనా.? అన్నది చర్చనీయాంశమైంది.  ఇప్పటి వరకు షర్మిల అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.. రేపు వైఎస్ విజయమ్మ, రాజశేఖర్ రెడ్డిల పెళ్లిరోజు.. అందుకే ఇలాంటి సమయంలో  పార్టీని ఖరారు చేయడం మంచిదని షర్మిల  భావిస్తున్నట్టు సమాచారం.

గత కొంతకాలంగా సీఎం, అన్న వైఎస్ జగన్ కు షర్మిల దూరంగానే ఉంటున్నారన్నది బహిరంగ రహస్యం. జగన్ తరువాత తానే వారసురాలు అని ఆమె భావించారు.. కానీ ప్రస్తుతం ఏపీలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు.  అందుకే షర్మిల అన్న తీరుపై గుర్రుగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.  ధాదాపు ఏడాదిగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  అయితే ఒకవేళ ఆమె పార్టీ పెడితే తెలంగాణకే  పరిమితం అవుతారా..? నేరుగా అన్నమీద ఏపీలో పోటీకి దిగుతారా అన్నది ఆసక్తి  పెంచుతోంవది.. ఏది ఏమైనా రేపటి సమావేశం తరువాత పూర్తి క్లారిటీ వఛ్చే అవకాశం ఉంది.

Comments